న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆ యువకుడికి ఆర్మీలో చేరాలనేది లక్ష్యం. కానీ రెండేండ్లుగా ఆర్మీ నియామకాలు జరగట్లేదు. తన నిరసన కేంద్రానికి తెలియజేయాలని భావించాడు. అందుకు 350 కిలోమీటర్ల దూరం ఏకబిగిన పరిగెత్తాడు. రాజస్థాన్లోని శిఖర్ నుంచి ఢిల్లీ వరకు రన్నింగ్ చేశాడు. రాజస్థాన్లోని నగౌర్ జిల్లాకు చెందిన 24 ఏండ్ల సురేశ్ భిచర్ చేతిలో జాతీయ జెండా పట్టుకుని పరుగు లంఘించాడు. ఏకంగా 50 గంటల పాటు పరిగెత్తి తన నిరసన తెలిపాడు. ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నావికా దళ నియామకాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు వెయ్యి మంది ఆర్మీ ఉద్యోగార్థులు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాలో సురేశ్ పాల్గొన్నాడు.