ఊటీ : సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 బుధవారం నీలగిరి కొండల్లో కూలిన విషయం తెలిసిందే. అయితే ఆ దుర్ఘటనకు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నీలగిరిలోని టూరిస్టులకు ఆర్మీ హెలికాప్టర్ చిక్కినట్లు అర్థమవుతోంది. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఆ వీడియో తీసినట్లు స్పష్టమవుతోంది.
కింద నడుచుకుంటూ వెళ్తున్న కొందరు తమ సెల్ఫోన్ ద్వారా వీడియో తీస్తున్నారు. అయితే ఆ సమయంలో హెలికాప్టర్ శబ్ధం విన్నవాళ్లు.. ఆ హెలికాప్టర్ను తమ వీడియోలో బంధించారు. దట్టంగా ఉన్న పొగమంచుల్లోకి హెలికాప్టర్ వెళ్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. హెలికాప్టర్ పేలినట్లు ఆ వీడియోలో శబ్ధం వినిపిస్తోంది. ఊటీలో ఉన్న టూరిస్టులు కొందరు ఆ వీడియో తీశారు. ఆ హెలికాప్టర్ దిగువ స్థాయిలో ఎగురుతున్నట్లు వీడియోలో అర్థమవుతోంది. ఇక ఆ వీడియోలో ఉన్న వాళ్లు.. పేలిపోయిందా.. కూలిపోయిందా అనుకుంటూ తమిళ భాషలో కామెంట్లు చేసుకున్నారు. వాయుసేన ఈ వీడియోను ద్రువీకరించాల్సి ఉంది.