న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దేశ రాజధాని ఢిల్లీకి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్లో ఆదివారం నాలుగు అడుగుల గొయ్యి కనిపించడం భద్రతపై భయాందోళనలు రేకెత్తించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వైమానిక దళ బృందం వెంటనే గొయ్యిని మట్టితో పూడ్చేసింది. ఎయిర్ బేస్ సరిహద్దులో ఉన్న 20 అడుగుల గోడ పునాదులను పగులగొట్టి ఈ గొయ్యి తవ్వినట్టు తెలుస్తున్నది.
ఎయిర్బేస్ సరిహద్దులో ఒక సొరంగం ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల స్థానికంగా దొంగతనాలు జరగడానికి ఈ గొయ్యి కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులు, డ్రగ్స్కు బానిసలైనవారే ఇలాంటి పనులకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. గొయ్యి బయటపడటంపై వైమానిక దళం ప్రకటన చేయలేదు. కీలకమైన ఆక్రమణ, స్వాధీన ఆపరేషన్ల కోసం ఆర్మీ హిండన్ ఎయిర్ బేస్ను ఉపయోగిస్తున్నది.