ధన్బాద్, జనవరి 31: జార్ఖండ్లో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ధన్బాద్ పట్టణంలోని ఓ బహుళ అంతస్థుల అపార్ట్మెంట్లో భారీఎత్తున మంటలు చెలరేగాయి. కడపటి వార్తలు అందే సమయానికి ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. భవనంలో కొంతమంది చిక్కుకుపోయినట్టు తెలుస్తున్నదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. 13 అంతస్థులు ఉన్న ఈ భవనంలో ప్రమాద సమయంలో దాదాపు 400 మంది ఉన్నట్టు సమాచారం.