Chandrayaan-3 | న్యూఢిల్లీ : భారత్ చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడం వెనక ఎంతోమంది కృషి ఉంది. అలాంటి వారిలో దీపక్ కుమార్ ఉప్రారియా ఒకరు. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ)కు చెందిన ఈ టెక్నీషియన్ చంద్రయాన్-3 లాంచ్ప్యాడ్ నిర్మాణంలో పనిచేశాడు. అలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పనిచేసిన దీపక్ ఇప్పుడు రాంచీలో రోడ్డుపక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. వినడానికి కొంచెం బాధగా ఉన్నా ఇది నిజం. ధుర్వా ప్రాంతంలోని పాత అసెంబ్లీకి ఎదురుగా ఆయన చిన్న స్టాల్ పెట్టుకుని ఇడ్లీలు, టీ అమ్ముకుని జీవిస్తున్నాడు. చంద్రయాన్-3 ఫోల్డింగ్ ప్లాట్ఫామ్, ైస్లెడింగ్ డోర్ తయారుచేసిన హెచ్ఈసీ దీపక్కు 18 నెలలుగా వేతనం ఇవ్వడం లేదు. దీంతో కుటుంబం గడవడం కోసం ఆయన ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు. చంద్రయాన్-3 విజయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. లాంచ్ప్యాడ్ వర్కర్లను కూడా ప్రశంసించారు. అయితే, అది అక్కడికే పరిమితమైంది.
దీపక్ లాంటి మిగతా టెక్నీషియన్లు 18 నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్నా నిరాశే మిగిలింది. జీతాల కోసం నిరసనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దాదాపు 2,800 మంది ఉద్యోగులకు హెచ్ఈసీ 18 నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఇక ఆకలి చనిపోవడం ఖాయమనుకున్న సమయంలో మరో గత్యంతరం లేక ఇడ్లీ షాప్ ప్రారంభించినట్టు దీపక్ చెప్పుకొచ్చాడు. తాను ఉదయం ఇడ్లీలు అమ్ముకుని మధ్యాహ్నం వర్క్కు వెళ్తానని, తిరిగి సాయంత్రం మళ్లీ ఇడ్లీలు విక్రయిస్తూ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నట్టు చెప్పాడు. తొలుత క్రెడిట్ కార్డుతో ఇంటిని మ్యానేజ్ చేశానని, ఆ తర్వాత బ్యాంకులో రూ. 2 లక్షల రుణం తీసుకున్నానని, తిరిగి చెల్లించకపోవడంతో తనను డిఫాల్టర్గా ప్రకటించినట్టు చెప్పాడు.
ఆ తర్వాత బంధువుల నుంచి డబ్బులు తీసుకుని ఇంటిని నడిపినట్టు తెలిపాడు. ప్రస్తుతం తన తలపై రూ. 4 లక్షల అప్పు ఉన్నట్టు తెలిపాడు. ఎవ్వరికీ డబ్బులు తిరిగి చెల్లించలేకపోయానని, ఆ తర్వాత తన భార్య నగలను కూడా కుదవ పెట్టేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తాను ఇడ్లీలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో ఇల్లు నడుపుతున్నట్టు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్లోని హర్దా జిల్లాకు చెందిన ఉపారియా ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేసేవాడు. 2012లో హెచ్ఈసీలో రూ. 8 వేల జీతానికి చేరాడు. అయితే, ఇక్కడ కూడా ఆయనకు కలిసి రాలేదు. తనకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, స్కూలు ఫీజు చెల్లించకపోవడంతో రోజూ నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నాడు. పిల్లలు ఇంటికొచ్చి ఏడుస్తుంటే తనకు కూడా ఏడుపొస్తున్నదని, కానీ వారి ముందు తాను కన్నీళ్లు పెట్టుకోలేనని దీపక్ చెప్పుకొచ్చాడు.