చత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా కట్ఘోరా ప్రాంతంలో 45 ఏనుగులు నానా బీభత్సం సృష్టించాయి. ఒక్క రాత్రిలోనే మూడు గ్రామాల్లోని 18 ఇళ్లపై పడి, ధాన్యం మొత్తాన్ని తినేశాయి. ఈ ఘటన రాత్రి పూట జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వరి మిల్లింగ్కి సంబంధించిన పనులను కూడా స్థానికులు మానేశారు. ఈ 45 ఏనుగుల మంద ఇప్పటికీ ఈ గ్రామ పరిసరాల్లోని అడవిలోనే ఉన్నాయి. ఉదయమంతా అడవుల్లో ఉంటూ, రాత్రి కాగానే గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు ఏనుగుల మంద ఎప్పుడు తమ ఇళ్లపై దాడి చేస్తుందో తెలియక, గ్రామస్థులందరూ జాగారం చేస్తున్నారు. ”ఏనుగుల మంద నానా బీభత్సం చేస్తోంది. ఇళ్లలోకి చొరబడుతోంది. ఇళ్లలో ఉండే ధాన్యాన్ని తినేస్తున్నాయి. ఉదయమంతా అడవుల్లో ఉంటున్నాయి. రాత్రి కాగానే గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. పంట పొలాలపై పడి, కూరగాయలను నాశనం చేస్తున్నాయి. దీంతో మా సిబ్బంది ఈ గ్రామాలపై దృష్టి సారించాం. దాదాపు 18 ఇళ్లను నాశనం చేశాయి” అని అటవీ అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ కట్ఘోరా ప్రాంతం గత రెండున్నర సంవత్సరాలుగా ఈ సమస్యతో సతమతమవుతోంది. జనవరి నుంచి డిసెంబర్ వరకూ దాదాపు 300 ఇళ్లపై దాడి చేశాయి. ఇందులో 120 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఏనుగుల మంద ఎప్పుడు ఏ గ్రామంలోకి చొరబడుతుందో తెలియడం లేదని అధికారులు నానా హైరానా పడిపోతున్నారు.