Elections | న్యూఢిల్లీ: భారత్, అమెరికాల్లో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ‘హెల్త్ ఎకనమిక్స్’ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం… పోలింగ్, అనారోగ్య పరిస్థితుల మధ్య సంబంధం ఉంది. ఎన్నికల వాతావరణం ఉధృతంగా ఉన్న సమయంలో అత్యధిక ఓటర్లు ఛాతీ నొప్పి, తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, జీర్ణాశయ సమస్యలతో దవాఖానాల్లో చేరే పరిస్థితులు వస్తాయని పరిశోధకులు చెప్తున్నారు.
2012 నుంచి జరిగిన నాలుగు ఎన్నికల సీజన్లలో 9 లక్షల మంది ఆరోగ్య రికార్డులను ఈ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఓటర్లు కొవిడ్ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువేనని గుర్తించారు. జాతీయ స్థాయి ఎన్నికల ప్రచారం జరిగేటపుడు ఆరోగ్య సంరక్షణ కోసం మందుల వాడకం, వాటి కోసం చేసే ఖర్చులు 17 శాతం నుంచి 19 శాతం వరకు పెరిగినట్లు గమనించారు. మొదటిసారి ఓటు హక్కును పొందినవారిపై ఈ దుష్ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఏదో ఒక అస్వస్థతకు దారి తీసే ఆందోళనను “ఎలక్షన్ స్ట్రెస్ డిజార్డర్”గా లేదా “ఎలక్షన్ సిండ్రోమ్”గా పేర్కొనాలని ఈ పరిశోధకులు చెప్పారు. రాజకీయ ప్రకటనల పెరుగుదల, ప్రచారం కూడా ఇటువంటి అస్వస్థతకు దారి తీస్తుందని ఈ అధ్యయనం తెలిపింది.
నిరంతరాయంగా రాజకీయ ప్రచారాన్ని వినడం, తెలుసుకోవడం వంటి వాటివల్ల రోగ నిరోధక వ్యవస్థ క్షీణిస్తుందని, చివరికి శుష్కించిపోతుందని చెప్పింది. ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి ఉండటం వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. ఎన్నికల్లో ఎక్కువసేపు పని చేసే యువతీ, యువకులు ఘర్షణాత్మక ఓటర్ల కారణంగా ఒత్తిడికి గురై మరణిస్తున్నట్లు గుర్తించింది.
ఈ అధ్యయనం ప్రకారం.. ఎన్నికలను నిర్వహించడం ఎన్నికల సిబ్బందికి పెను సవాలు. సిబ్బంది సుదీర్ఘ సమయం పని చేస్తుంటారు. ఘర్షణలకు దిగే ఓటర్లను వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓడిపోయేవారి పక్షం వహించినవారిలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ అత్యధికంగా ఉంటుంది. వీరి టెస్టోస్టిరోన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్ర ఆందోళన, ఒత్తిడి, మనసు బాగోలేకపోవడం వంటివాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది.