కొట్టాయం: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఊమెన్ చాందీ( Oommen Chandy) మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్ధీవదేహాన్ని పుత్తుపల్లిలో ఉన్న సెయింట్ జార్జ్ చర్చి ప్రాంగణంలో సమాధి చేయనున్నారు. పుత్తుపల్లి నియోజకవర్గం నుంచే చాందీ 12 సార్లు సార్లు విజయం సాధించారు. ప్రత్యేకమైన సమాధిని ఆ చర్చి వద్ద నిర్మిస్తున్నారు. సాధారణంగా ఆ చర్చి పూజారుల్ని సమాధి చేసే ప్రాంతంలో చాందీ కోసం సమాధిని సిద్ధం చేస్తున్నారు. నిజానికి ఊమెన్ చాందీ కుటుంబీకుల కోసం చర్చి శ్మశానవాటికలో స్థలం ఉన్నా.. ఆయన కోసం ప్రత్యేకమైన సమాధిని నిర్మిస్తున్నట్లు ఆ చర్చి ఫాదర్ డాక్టర్ వర్గీస్ వర్గీస్ తెలిపారు. స్పెషల్ టూంబ్ను కట్టాలని చర్చి కమిటీ నిర్ణయించిందన్నారు.
ఇక ఊమన్ చాందీ పార్ధీవదేహాన్ని .. గతంలో ఆయన ప్రయాణించిన ఆర్టీసీ బస్సులోనే తీసుకెళ్తున్నారు. కేరళ రాష్ట్ర రవాణాశాఖకు చెందిన బస్సును .. చాందీ అంతిమయాత్ర కోసం స్వర్గపురి వాహనంగా మార్చేశారు. తిరువనంతపురం నుంచి కొట్టాయం వరకు చాందీ భౌతికకాయాన్ని తరలిస్తన్నారు. తిరువనంతపురంలోని పప్పానంకోడ్ డిపోకు చెందిన బస్సులో గతంలో చాందీ ప్రయాణించారు. ఆ సమయంలో ఆయన ఆ బస్సు కండెక్టర్తో ముచ్చటించారు. 2016, జూలై 29వ తేదీన ఆయన ప్రయాణించిన బస్సులోనే.. ఇప్పుడు ఆయన పార్దీవ దేహాన్ని తీసుకెళ్తన్నట్లు ఫేస్బుక్ పేజీలో తెలిపారు.
79 ఏళ్ల చాందీ కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, తెలంగాణ,కేరళ, తమిళనాడు సీఎంలు సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెల్లని దుస్తుల్లో సామాన్యుడిలా కనిపించిన ఆయన తన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. చాందీ విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సొంత నియోజకవర్గం పుతుపల్లి నుంచి వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కేరళ అసెంబ్లీకి సుదీర్ఘ కాలం సేవలందించిన ప్రజాప్రతినిధిగా రికార్డు సృష్టించారు. కేరళకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. సోలార్ స్కామ్లో ఆయన ప్రమేయం ఉన్నదని 2016లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సీబీఐ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది.