పట్నా: బీహార్లో మరో దారుణం జరిగింది. పట్నాలోని బిహ్త ఏరియాలోగల ఓ పాఠశాలలో గురువారం పంతులమ్మలు జట్లుజుట్లు పట్టుకుని కొట్టుకున్న ఘటనను మరువకముందే మరో ఘటన వెలుగుచూసింది. తూర్పు చంపారన్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇచ్చిన హోమ్ వర్క్ చేసుకురాలేదన్న కోపంతో ఇవాళ ఓ మహిళా టీచర్ బాలుడిని తీవ్రంగా కొట్టి భవనం పైనుంచి కిందకు విసిరేసింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరానికి పాల్పడిన ఉపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. బాలుడి ఒంటిపై కర్రతో కొట్టిన గాయాలున్నాయని, ముందుగా తీవ్రంగా కొట్టి ఆ తర్వాత కిందకు తోసేసి ఉంటదని కుటుంబసభ్యులు తెలిపారు.
హోమ్ వర్క్ చేసుకురాలేదంటూ టీచర్ అతడిని తీవ్రంగా కొట్టిందని, ఆ తర్వాత కొట్టుకుంటే పైకి తీసుకెళ్లిందని, కాసేపటికే అతను పైనుంచి కింద పడిపోయాడని బాధిత బాలుడి తోటి విద్యార్థులు చెబుతున్నారు.