DMK Raja: ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీ ఎ రాజా భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వంపై మరోసారి ద్వేషపూరిత ప్రసంగం చేశారు. దేశమంటే ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష ఉండాలని అన్నారు. భారతదేశంలో అలా లేదని, కాబట్టి భారత్ ఒక దేశం కాదని వ్యాఖ్యానించారు. అంతేగాక శ్రీరాముడిని కూడా అవహేళన చేస్తూ మాట్లాడారు.
‘భారతదేశం ఒక దేశం కాదు. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక దేశం అంటే ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఒక దేశంగా పరిగణిస్తారు. భారతదేశం ఒక ఉపఖండం. కారణం ఏమిటంటే ఇక్కడ తమిళం ఒక దేశం, మలయాళం ఒక దేశం. ఇలా దేశాలన్నీ కలిసి భారతదేశాన్ని ఏర్పరుస్తాయి. సంస్కృతులు కూడా వేరుగా ఉన్నాయి’ అని రాజా అన్నారు.
‘మన ఇళ్లలోనే వంటగది, టాయిలెట్లకు ఒకే ట్యాంకర్ నుంచి నీళ్లు వస్తాయి. కానీ టాయిలెట్లో వచ్చే నీళ్లను వంటగదిలో ఉపయోగించరు. నీరు ఒక్కటే, అది వచ్చే ప్రదేశాన్ని బట్టి దేనికి వినియోగించాలనేది ఆధారపడుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
‘మేం రాముడికి శత్రువులం. నాకు రామాయణంపైన, రాముడిపైన విశ్వాసం లేదు’ అని రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజా చేసిన ఈ వ్యాఖ్యలపైన అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి మండిపడ్డారు. దీనిపైన ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాస్తామని తెలిపారు.
భారతదేశ ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను బహిరంగంగా కించపరచడం వంటివి క్షమించరానివని, ఈ వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని, వెంటనే ఎ రాజాను అరెస్టు చేయాలని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధులు డిమాండ్ చేశారు.