న్యూఢిల్లీ: వాతావరణంలో అంతకంతకూ చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ప్రపంచంలోని మహా సముద్రాలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో వాతావరణ పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్టానికి చేరాయి. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియమ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్(ఈసీఎండబ్ల్యూఎఫ్)కు చెందిన వాతావరణ నిపుణుడు సమంథా బర్గస్ మీడియా ఏజెన్సీ ఎఎఎఫ్తో మాట్లాడుతూ ‘కొద్ది రోజుల్లో మనం మరోమారు అత్యధిక స్థాయి సముద్రపు ఉపరిత ఉష్ణోగ్రతలను తిరిగి చవి చూడబోతున్నాం’ అని హెచ్చరించారు.
ఈసీఎండబ్ల్యూఎఫ్కు చెందిన అధికారిక వాతావరణ పర్యవేక్షక కార్యక్రమం కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం 2026 ఏప్రిల్లో సముద్రపు ఉపరిత ఉష్ణోగ్రతలను పరిశీలించగా, మరోమారు అత్యధిక స్థాయికి చేరాయని వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఇది గతంలోని బెంచ్ మార్క్ కన్నా 1.43 డిగ్రీ సెల్సియస్ అధికం. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడమనేది ఆకస్మికం కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఇది ఎల్ నినో ప్రారంభానికి సంకేతమంటున్నారు. ఇది సూపర్ ఎల్ నినోకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
సూపర్ ఎల్ నినో గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎల్ నిలో గురించి తెలుసుకోవాలి. ఏటా మహా సాగరాల ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. అయితే ఉష్ణ మండలాలు మీదుగా వీచే తూర్పు గాలులకు ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు భంగం కలిగిస్తాయి. నిజానికి ఈ గాలులు ప్రపంచ వాతావరణ సరళిని సమతుల్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఈ గాలులు బలహీన పడినప్పుడు మహా సాగరాల ఉపరితల ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయి.
ఫలితంగా భూ వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో కొన్ని చోట్ల వరదలు సంభవిస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయి. ఇటువంటి పరిస్థితినే ఎల్ నినో అంటారు. సముద్రపు ఉష్ణోగ్రతలు చారిత్రక సగటు కంటే 0.5 డిగ్రీల సెల్సియస్ పెరగడం అనివార్యం. అయితే సూపర్ ఎల్ నినో స్థితిలో సముద్రపు ఉపరిత ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్ కన్నా అధికం అవుతాయి. ఫలితంగా అకస్మాత్తుగా వరదలు సంభవించడం, అడవులు తగలబడటం లాంటి ఘటనలు ఉద్భవిస్తాయి.
సూపర్ ఎల్ నినో పరిస్థితులు భారత్ను వణికిస్తున్నాయి. ఈ సంవత్సరం నైరుతి రుతు పవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులు గడ్డ్డు కాలాన్ని ఎదుర్కోనున్నారు. అయితే ప్రస్తుతానికి హిందూ మహా సముద్రం తటస్థ స్థితిలో ఉన్నదని ఐఎండీ చెబుతోంది. ఫలితంగా భారత్కు వెంటనే ముప్పు ఏర్పడే పరిస్థితులు లేవని ఐఎండీ చెబుతున్నది.