Blast | ఉత్తరప్రదేశ్ కన్పూర్ నగరంలో భారీ పేలుడు జరిగింది. బుధవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో మూల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిశ్రీ బజార్లోని మర్కజ్ వాలి మసీదు సమీపంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దం చాలా శక్తివంతంగా ఉండడం దాదాపుగా 500 మీటర్ల దూరం వరకు వినిపించింది. పేలుడు తర్వాత జనం వీధుల్లోకి పరుగులు తీశారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని అనేక దుకాణాలు, ఇళ్ల గోడలు పగుళ్లు బారాయి. ఈ సంఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ఉర్సులా ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు గురించి సమాచారం అందిన వెంటనే.. మూల్గంజ్తో సహా పలు పోలీస్ స్టేషన్ల నుంచి దళాలు, బాంబు స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించలేకపోయారు. ఫోరెన్సిక్ బృందం, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తున్నాయని, నివేదిక వచ్చిన తర్వాతే పేలుడు ఎలా జరిగిందో స్పష్టంగా తెలుస్తుందని అధికారులు తెలిపారు.