న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ సిటీ బస్సులో వెళ్తున్న ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఉదయం వాహనాల రాకపోకలతో రద్దీ కొనసాగుతుండగా హాజ్ రాణి రెడ్ లైట్ (Hauz Rani Red Light) సమీపంలోని ప్రెస్ ఎన్క్లేవ్ రోడ్డు (Press Enclave Road) ఒక్కసారిగా కుంగిపోయింది. దాంతో పెద్దగా గొయ్యి ఏర్పడింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ సిటీ బస్సు ఆ గోతిలో ఇరుక్కుపోయింది. అయితే బస్సు రోడ్డుపై ఏర్పడ్డ గోతికి చివరి అంచులో ఉండటంతో ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
బస్సు రోడ్డుకు ఇంకొంచం ఎడమవైపునకు వచ్చి ఉంటే గొయ్య ఇంకా పెద్దగా ఏర్పడేది, బస్సు పూర్తిగా గోతిలో పడిపోయేది. అదే జరిగి ఉంటే బస్సులోని ప్రయాణికుల్లో చాలా మందికి గాయాలు అయ్యేవి. కాగా, సాకేత్ కోర్టు (Saket Court) నుంచి మాలవీయ నగర్ పీటీఎస్ (PTS, Malviya Nagar) కు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు (Delhi Traffic Police) చెప్పారు. రోడ్డు కుంగడం (Road caved)తో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలిపారు.