న్యూఢిల్లీ, మార్చి 17: వాట్సప్లో ‘వికసిత్ భారత్ సంపర్క్’ పేరుతో ప్రజలకు వస్తున్న ఓ సందేశంపై రాజకీయ దుమారం రేగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి పాల్పడుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలకు వస్తున్న ఆ సందేశంలో ప్రధాని మోదీ పంపినట్టుగా ఒక లేఖను అటాచ్ చేశారు. అదేవిధంగా గత పదేండ్లలో దేశంలోని కోట్లాది కుటుంబాలు కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాయని, వికసిత్ భారత్ ఆకాంక్షలను నెరవేర్చేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఆలోచనలను పంచుకోవాలని ఆ సందేశం కోరింది. అయితే ఈ సందేశంపై కాంగ్రెస్ కేరళ యూనిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇది రాబోయే లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఒక భాగమని, ప్రభుత్వాన్ని అందులో భాగం చేస్తున్నారని, ప్రభుత్వం ప్రజల డాటాను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించింది. ఫీడ్బ్యాక్ ముసుగులో అందులో అటాచ్ చేసిన పీడీఎఫ్ ఫైల్ ఒక రాజకీయ ప్రచారంతో కూడినదని కేరళ కాంగ్రెస్ మెటా సంస్థను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్టు చేసింది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో శనివారం సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వికసిత్ భారత్ పేరుతో సందేశాలు వస్తున్నాయని టీఎంసీ నేత మహువా మొయిత్రా ఆక్షేపించారు.