ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో ఓ మహిళకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. అకస్మాత్తుగా రైలు ముందు దూకిన మహిళను పోలీసులు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ కేసులో నిందితురాలిగా మహిళను విచారణ నిమిత్తం ఒక మహిళా కానిస్టేబుల్, మరో మేల్ కానిస్టేబుల్ కస్టడీలో ఒక ఏరియా నుంచి మరో ఏరియాకు తీసుకెళ్తున్నారు. దాదర్ రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత మేల్ కానిస్టేబుల్ ముందు నడుస్తుండగా మహిళా కానిస్టేబుల్ నిందితురాలిని పట్టుకుని వెనుకాలే వస్తున్నది.
సరిగ్గా అప్పుడే ఎదురుగా లోకల్ రైలు వస్తుండటం గమనించిన నిందితురాలు ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్ను విదిలించుకుని రైలు పట్టాలపై దూకేసింది. వెంటనే గమనించిన మేల్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్పై దూకి నిందితురాలిని రక్షించారు. కాగా, ఉన్నట్టుండి మహిళ ఒకేసారి రైలు ముందు దూకడంతో రైల్వేస్టేషన్లో కలకలం చెలరేగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.