Air India Case | ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధ మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన ఘటనకు సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడైన శంకర్ మిశ్రా శుక్రవారం ఢిల్లీ కోర్టులో సమాధానం దాఖలు చేశారు. సదరు వృద్ధ మృహిళపై తాను మూత్ర విసర్జన చేయలేదని, ఆమెనే మూత్రం పోసుకున్నట్లు చెప్పాడు. ఈ కేసులో శంకర్ మిశ్రా పోలీసులు కస్టడీకి కోరగా.. ఇందుకు దిగువ కోర్టు నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
పోలీసుల పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేయగా.. నిందితుడు శంకర్మిశ్రా తరఫున న్యాయవాది కోర్టు కు సమాధానం ఇచ్చారు. నిందితుడు శంకర్ మిశ్రా మూత్ర విసర్జన చేసింది తాను కాదని, ఆ మహిళే మూత్రం పోసుకుందని, ప్రొస్టేట్ సంబంధిత సమస్యలతో బాధపడుతుందని, అలాంటి వారు ఇలా చేసుకోవడం సహజమేనని చెప్పాడు. అంతే కాకుండా వృద్ధురాలి సీటు వద్దకు వెళ్లలేని విధంగా సీటింగ్ మూలన ఉందని, అక్కడికి వెళ్లినా సీటు వెనుక వైపు నుంచి మాత్రమే వెళ్లగలరని, నేను మద్యం మత్తులో ఆమె సీటు వద్దకు వెళ్లినా.. మూత్ర విసర్జన చేశానంటే వెనుక సీట్లో కూర్చున్న వారు ఫిర్యాదు చేయాలి కదా? అంటూ ప్రశ్నించాడు.
ఇదిలా ఉండగా.. నవంబర్ 26న న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తాగుబోతు తన సీటు వద్దకు వచ్చి మూత్ర విసర్జన చేసినట్లు ఎయిర్ ఇండియా చైర్మన్కు రాసిన లేఖలో ఆరోపించిన విషయం తెలిసిందే. బట్టలు, బ్యాగులు, బూట్లు పూర్తిగా మూత్రంతో తడిసిపోయాయని మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వెళ్లిపోయినట్లు పేర్కొంది. ఆ తర్వాత ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఘటనపై దర్యాప్తు కోసం అంతర్గత కమిటీని సైతం ఏర్పాటు చేసింది. పోలీసులు బెంగళూరులో శంకర్ మిశ్రాను అదుపులోకి తీసుకొని.. ఢిల్లీ కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.