ఇంఫాల్, మే 31: మణిపూర్ అల్లర్లకు సంబంధించి కొత్త కోణం తెరపైకి వచ్చింది. అల్లర్లకు ఆజ్యం పోయడంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లీషెంబ సనజవోబ పాత్రపై విచారణ జరిపించాలని మణిపూర్ ట్రైబల్స్ ఫోరమ్, ఢిల్లీ(ఎంటీఎఫ్డీ) డిమాండ్ చేసింది. అల్లర్లపై విచారణ జరపాలని కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంటీఎఫ్డీ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించింది. కుకి, జోమి, మిజో, హ్మర్ ప్రజలపై అరంబై టెంగోల్, మీతీ లీపన్ వంటి మైతీ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. మీథీ లీపన్ సంస్థకు బీజేపీ ఎంపీ సనజవోబతో సంబంధాలు ఉన్నాయని, అరంబై టెంగోల్ అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసిందని పేర్కొన్నది. కాబట్టి, ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, ఎంపీ సనజవోబ పాత్రపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరింది. మరోవైపు కుకి, జోమి, హ్మర్ తెగలకు చెందిన విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని, కుకి, జోమి, హమ్మర్ తెగలకు ప్రత్యేక పాలనను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నెల రోజుల క్రితం మొదలైన అల్లర్ల నుంచి మణిపూర్ ఇంకా కోలుకోవడం లేదు. కర్ఫ్యూ నీడన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇంటర్నెట్ సేవలు ఇంకా పూర్తిగా పునరుద్ధరించలేదు. ఏటీఎంలలో డబ్బులు లేవు. బ్యాంకులు పని చేయడం లేదు. నిత్యావసర సరుకులు కొనడానికి ప్రతి రోజూ రెండు మూడు గంటల పాటు కర్ఫ్యూ నిబంధనలు సడలిస్తున్నారు. దీంతో సరుకులు తెచ్చుకోవడానికి దుకాణాల ముందు తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. అయినా కూడా చాలామందికి సరుకులు లభించడం లేదు. నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఉండటంతో అంతటా ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. పలు రహదారులను ఆందోళనకారులు దిగ్భందించడం, సరుకుల రవాణాకు ట్రాన్స్పోర్టర్లు ధైర్యం చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది. మరోవైపు విద్యాసంస్థలు కూడా నడవక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు కోరుతున్నారు.
మణిపూర్ ట్రైబల్స్ ఫోరమ్, ఢిల్లీ(ఎంటీఎఫ్డీ) డిమాండ్