Crime news: సాధారణంగా చిన్న పిల్లలకు పక్క తడిపే అలవాటు ఉంటుంది. కొంతమంది త్వరగా ఈ అలవాటును మానుకుంటే.. మరికొందరు ఎక్కువ రోజులు మానుకోలేకపోతారు. అయితే పిల్లలకు ఉండే ఈ సాధారణ అలవాటు గురించి తల్లులు పెద్దగా ఆందోళన చెందరు. ఎందుకంటే మెల్లమెల్లగా ఆ అలవాటు పోతుందని వారికి తెలుసు కాబట్టి. కానీ అరుదుగా కొందరు తల్లులు మాత్రం పిల్లల్లోని ఈ అలవాటుపై విసుగు ప్రదర్శిస్తారు. అమెరికాలోని ఓ తల్లి అయితే ఏకంగా బిడ్డను కొట్టి చంపేసింది.
వివరాల్లోకి వెళ్తే.. 28 ఏళ్ల టియానా రాబిన్సన్, నాలుగేళ్ల నహ్లా మిల్లర్ తల్లీ కూతుళ్లు. వీరు హామిల్టన్ కౌంటీలో ఉంటారు. నహ్లా మిల్లర్కు పక్కలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంది. ఇది నచ్చని ఆమె తల్లి టియానా పాపను విపరీతంగా కొట్టింది. దారుణంగా హింసించింది. ఆఖరుకు గొంతు కూడా కోసేసింది. ఈ దాడిలో నహ్లా తీవ్రంగా గాయపడింది. మెదడుకు కూడా బాగా దెబ్బలు తగిలాయి. దాంతో చిన్నారి నహ్లా మరణించింది.
ఈ దారుణ ఘటన 2021లో జరిగింది. టియానాపై హత్య కేసు నమోదైంది. కేసు విచారణ జరిపిన హామిల్టన్ కౌంటీ టియానా శిక్షను ఖరారు చేసింది. కౌంటీ ప్రాసిక్యూటర్ ఈ ఘటనను దారుణమైనదిగా పేర్కొన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన టియానాకు ౩౦ సంవత్సరాల జైలుశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. టియానాకు మానసిక రుగ్మత ఉన్న కారణంగా జైలుశిక్షతో పరిపెడుతున్నామని, లేదంటే మరింత దారుణమైన శిక్ష విధించాల్సిందని ప్రాసిక్యూటర్ వ్యాఖ్యానించారు.