బెంగళూరు: రెండు ఇండిగో విమానాలు గాల్లో ఢీకొనబోయాయి. అయితే రాడార్ గుర్తించడంతో ముప్పు తప్పింది. కర్ణాటకలోని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో రెండు రన్వేలున్నాయి. ఉత్తర రన్వే టేకాఫ్కు, దక్షిణ రన్వే ల్యాండింగ్కు వినియోగిస్తుంటారు. అయితే ఈ నెల 9 ఉదయం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం ఉత్తర రన్వేను మాత్రమే వినియోగించాలని, దక్షిణ రన్వేను మూసివేయాలని షిఫ్ట్ ఇంచార్జ్ నిర్ణయించారు. అయితే దక్షిణ రన్వే టవర్ కంట్రోలర్కు ఈ సమాచారం ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో బెంగళూరు-కోల్కతా ఇండిగో విమానం 6ఈ 455 టేకాఫ్ కోసం ఉత్తర రన్వే నుంచి అనుమతి ఇచ్చారు. అలాగే సమన్వయ, సమాచార లోపం వల్ల బెంగళూరు-భువనేశ్వర్ ఇండిగో విమానం 6ఈ 246 దక్షిణ రన్వే నుంచి టేకాఫ్ కోసం అనుమతిని ఆ టవర్ కంట్రోల్ ఇచ్చింది. దీంతో రెండు విమానాలు ఒకేసారి టేకాఫ్ అయ్యాయి. గాల్లో అత్యంత దగ్గరగా అవి సమీపిస్తుండగా గుర్తించిన రాడార్లు హెచ్చరించాయి. దీంతో పైలట్లు ఆ విమానాలను దూరంగా మళ్లించడంతో ఢీకొనే ముప్పు తప్పింది.
మరోవైపు ఈ తప్పిదాన్ని లాగ్బుక్లో ఎంటర్ చేయకపోగా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) దృష్టికి కూడా సిబ్బంది తీసుకెళ్లలేదు. అయితే ఈ విషయం తెలుసుకున్న డీజీసీఏ దీనిపై సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.