శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఇవాళ దారుణం జరిగింది. అష్ముకం ఏరియాకు చెందిన జావేద్ అహ్మద్ అనే మానసిక రోగి కన్నతల్లిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిపై కౄరంగా దాడికి పాల్పడ్డాడు. అతడి దాడిలో జావేద్ తల్లితోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో నిందితుడి తల్లి హఫీజాతోపాటు గులాంనబీ, మొహమ్మద్ అమిన్ ఉన్నారు. ఇదే దాడిలో గాయపడిన మరో ఏడుగురిని స్థానికులు సమీప ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జావేద్ అహ్మద్ ఉదయాన్నే మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవకు దిగాడని స్థానికులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తల్లిపై ఇష్టారీతిన దాడి చేస్తుండటంతో ఇరుగుపొరుగు అడ్డుకునే ప్రయత్నం చేశారని, దాంతో వారిపై కూడా దాడికి పాల్పడ్డాడని, ఇలా మొత్తం 10 మందిపై దాడి చేయగా ముగ్గురు మరణించారని, ఏడుగురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారని స్థానికులు పోలీసులకు వివరించారు. గాయపడిన వారిలో కూడా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.