Bihar | ఇదో వింత ఘటన.. ఓ వివాహిత తన భర్తను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. భర్తేమో.. అతడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్లోని ఖగాడియా జిల్లాలో వెలుగు చూసింది.
ఖగాడియా జిల్లా చౌథమ్ బ్లాక్లోని హార్డియా గ్రామంలో ముఖేశ్, నీరజ్ అనే ఇద్దరు వ్యక్తులు నివాసముంటున్నారు. వీరిద్దరికి వేర్వేరు మహిళలతో వివాహాలు అయ్యాయి. కానీ నీరజ్ భార్య ముఖేశ్ను పెళ్లికి ముందే ప్రేమించింది. పెళ్లి అయిన తర్వాత కూడా ముఖేశ్తో సన్నిహితంగా ఉంటోంది. ముఖేశ్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నీరజ్కేమో నలుగురు పిల్లలు ఉన్నారు.
అయితే ముఖేశ్ తన ప్రియురాలిని విడిచి ఉండలేకపోతున్నాడు. ఆమె కూడా అతన్ని వదిలిపెట్టి ఉండలేకపోతోంది. దీంతో ముఖేశ్ తన ముగ్గురు పిల్లలను, ప్రియురాలిని తీసుకొని గతేడాది ఫిబ్రవరిలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ప్రియురాలు రూబీని వివాహం చేసుకున్నాడు. తన భార్య ముఖేశ్తో వెళ్లిపోవడాన్ని సహించని నీరజ్.. పస్రాహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలోనే గ్రామ పెద్దలను కూడా నీరజ్ సంప్రదించాడు. దీంతో ముఖేశ్ను గ్రామ పెద్దలు పిలిపించి పంచాయితీ పెట్టారు. తనకు ప్రియురాలే ముఖ్యం అని ముఖేశ్ తెగేసి చెప్పాడు. నీరజ్ ముఖేశ్పై కక్ష పెంచుకున్నాడు. చేసేదేమీ లేక ముఖేశ్ భార్యతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు దగ్గరయ్యాడు. తన నలుగురి పిల్లల ఆలన పాలనా కోసం ముఖేశ్ భార్యను ఈ నెల 18న నీరజ్ వివాహం చేసుకున్నాడు. అయితే నీరజ్ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ముఖేశ్ కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.