జైపూర్: దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని హత్యచేసి 35 ముక్కలుగా నరికిన ఘటనను మరువక ముందే రాజస్థాన్ రాజధాని జైపూర్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అనూజ్ శర్మ అలియాస్ గోవింద్ దాస్ అనే 32 ఏండ్ల యువకుడు వితంతువైన తన మేనత్తను సుత్తితో కొట్టి చంపి, మృతదేహాన్ని మార్బుల్ కటింగ్ యంత్రంతో 10 ముక్కలు చేశాడు. ఆ తర్వాత ఆ ముక్కలను బకెట్లో తీసుకెళ్లి జాతీయ రహదారి పక్కన అడవిలో వేర్వేరు చోట్ల పడేశాడు.
అనూజ్ శర్మ తన మేనత్త సరోజ్ శర్మ (64)తోపాటు జైపూర్లో నివాసం ఉంటున్నాడు. సరోజ్ భర్త చనిపోయినప్పటి నుంచి ఆమె బాగోగులను అనూజ్ చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆమె తన విషయాల్లో జోక్యం చేసుకుంటుండటం అనూజ్కి నచ్చలేదు. ఈ నెల 11న అనూజ్ ఢిల్లీ వెళ్లవలసి ఉండగా అందుకు సరోజ్ శర్మ నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అనూజ్.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. హార్డ్వేర్ షాపు నుంచి మార్బుల్ కటింగ్ మెషిన్ తెచ్చి మృతదేహాన్ని పది ముక్కలు చేశాడు.
వాటిని సూట్కేసులో పెట్టి ఢిల్లీ వెళ్లే నేషనల్ హైవే పక్కన అడవిలో వేర్వేరుచోట్ల పడేశాడు. తనపై ఎవరికీ అనుమానం రాకూడదన్న ప్లాన్తో తన మేనత్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, సరోజ్ శర్మకు ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. అనూజ్ కిచెన్లో రక్తపు మరకలను శుభ్రం చేస్తూ సరోజ్ కుమార్తెకు దొరికిపోయాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు దారుణం వెలుగులోకి వచ్చింది.