న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నేరాలకు అడ్డాగా మారుతున్నది. అక్కడ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలోని అలీ విహార్ ఏరియాలో దారుణ హత్య జరిగింది. చిన్న గొడవను మనుసులో పెట్టుకుని బైకులపై వచ్చిన మూక ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసింది. అతని ఒంటిపై మొత్తం 15 కత్తిపోట్లు పడ్డాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. అలీ విహార్ ఏరియాకు చెందిన అర్వింద్ మండల్ శుక్రవారం సాయంత్రం తన కొడుకును స్కూల్ నుంచి తీసుకుని వస్తుండగా ఓ వ్యక్తి బాలుడిని ఉద్దేశించి దుర్బాషలాడాడు. దాంతో అర్వింద్ మండల్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత తన కొడుకుతో కలిసి అర్వింద్ ఇంటివైపు వెళ్తుండగా నిందితుడు తన స్నేహితులతో కలిసి మరోసారి అడ్డగించాడు.
అక్కడ కొంతసేపు వాగ్వాదం జరుగగా స్థానికులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్దిచెప్పారు. అనంతరం అర్వింద్ మండల్ రాత్రి 9.40 గంటల సమయంలో ఇంటి ముందు నిలబడి ఉండగా.. నిందితుడు తన స్నేహితులతో కలిసి బైకులపై వచ్చి దాడి చేశాడు. కత్తులతో అర్వింద్ను విచక్షణారహితంగా పొడిచారు. భర్తను కాపాడుకునేందుకు భార్య రేఖా మండల్ మధ్యలోకి వెళ్లడంతో రాడ్డుతో ఆమె తల పగులగొట్టారు.
స్తానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి వెళ్లేసరికి నిందితులు పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న అర్వింద్ మండల్, రేఖా మండల్లను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్వింద్ మండల్ మరణించాడు. రేఖా మండల్ పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.