గిరిదిహ్: ఓ తాగుబోతు వేధింపులు భరించలేక వచ్చిన భార్య వచ్చినట్టే వదిలి వెళ్లిపోయింది. అలా మొత్తం 11 మందిని పెళ్లి చేసుకోగా ఆ పదకొండు మంది అతడిని విడిచిపెట్టి పోయారు. పేరుకు 11 పెళ్లిళ్లు చేసుకున్నా ఏ భార్యా ఎక్కువ రోజులు కాపురం చేయకపోవడంతో అతనికి సంతానం కలుగలేదు. ఆ తర్వాత నలుగురు పిల్లల తల్లిని 12వ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఫూటుగా మద్యం సేవించి వచ్చి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె ప్రాణాలు కోల్పోయింది.
జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ జిల్లాలోని తారాపూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తారాపూర్ గ్రామానికి చెందిన రామచంద్ర తూరి అనే వ్యక్తి పెళ్లికి ముందే మద్యానికి బానిసయ్యాడు. పెళ్లి చేస్తే మారుతాడని భావించి తల్లిదండ్రులు ఒక సంబంధం చూసి వివాహం జరిపించారు. కానీ, తాగి అతను పెట్టే టార్చర్ భరించలేక మొదటి భార్య వెళ్లిపోయింది. దాంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా వేధింపులకు తాళలేక వదిలేసి వెళ్లింది. అనంతరం మరో మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు 11 మందిని పెళ్లి చేసుకుంటే 11 మంది విడిచిపెట్టి పోయారు.
దాంతో ఆఖరికి నలుగురు పిల్లల తల్లి సావిత్రీ దేవిని రామచంద్ర తూరి 12వ వివాహం చేసుకున్నాడు. సావిత్రి దేవి గతంలోనే పెళ్లి చేసుకుని ముగ్గురు కొడుకులు, ఒక కూతురును కన్నది. ఆ తర్వాత భర్త మరణించడంతో పిల్లలతో కలిసి జీవనం గడుపుతోంది. అనంతరం తూరి పరిచయమై ఆమెను 12వ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా రామచంద్ర ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్యను దుర్భాషలాడుతూ కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బలకు తాళలేక ఆమె సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచింది.
ఈ ఘటన గురించిన సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడు రామచంద్ర తూరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.