అమృత్సర్: సాధారణంగా ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తి వారం పది రోజులు, మహా అయితే ఆరు నెలలు ఏడాది పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోగలడు. కానీ సహోద్యోగిని హత్య చేసిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 30 ఏళ్లు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగాడు. ముప్పై ఏళ్ల తర్వాత అతని జాడ కనిపెట్టిన పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. 1994, నవంబర్ 12న కశ్మీరాసింగ్ అనే వ్యక్తిని బిట్టూ సింగ్ అర్జున్ సింగ్ అలియాస్ బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి తన ఇద్దరు సహచరులు సల్వీందర్ మాజ్బీ, బావ్సింగ్ గౌడాస్లతో కలిసి నవీ ముంబైలో హత్య చేశాడు. ఒకే సంస్థలో పనిచేసే వీళ్లకు డ్రైవర్ను కశ్మీరాసింగ్ ఉద్యోగం నుంచి తొలగించిన విషయంలో గొడవ జరిగి హత్యకు దారి తీసింది.
హత్య జరిగిన కొన్ని రోజులకే సల్వీందర్ మాజ్బీ, బావ్సింగ్ గౌడాస్ పోలీసులకు పట్టుబడగా, బిట్టూ సింగ్ పారిపోయాడు. విచారణ జరుగుతుండగానే బావ్సింగ్ గౌడాస్ మరణించాడు. అప్పటి నుంచి బిట్టూ సింగ్ కోసం వెతుకుతున్న పోలీసులకు.. అతను అమృత్సర్ జిల్లాలోని తన స్వగ్రామం రయ్యాలో మారు పేరుతో ఉంటున్నట్లు సమాచారం అందింది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి బిట్టూ సింగ్ను అదుపులోకి తీసుకున్నారు.