Hardeep Singh Puri : ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (Ethanol-blended petrol – (E20)) సురక్షితం కాదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. బయో ఇంధనాలవల్ల ఆటోమొబైల్ ఇంజిన్లు దెబ్బతింటాయని పలువురు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారాలను కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి (Hardeep Puri) కొట్టిపారేశారు. పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలపడంవల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్త వాదన అన్నారు.
ఈ20 (E20) ఇంధనం పర్యావరణపరంగా ఉపయోగించడానికి సురక్షితమని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే దీర్ఘకాలంలో పాత వాహనాల్లో గ్యాస్కెట్స్, ఇంధన రబ్బర్ ట్యూబ్స్, పైపులను మార్చాల్సి రావచ్చని, అది పెద్ద సమస్యేమీ కాదని, సాధారణమైన విషయమేనని పేర్కొన్నారు. పలువురు ఉద్దేశపూర్వకంగానే ఇథనాల్తో సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రజల్లో తప్పుడు భయాలను సృష్టిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం.. రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్లో ఇంధన డిమాండ్ ప్రపంచ దేశాల్లో ఉన్న దానికంటే మూడు రెట్లు పెరుగుతుందన్నారు.
అలాంటి సమయంలో ఇథనాల్ ప్రధాన ఇంధన వనరుగా మారే అవకాశం ఉందని హర్దీప్ సింగ్ పురి అన్నారు. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ కొంతమేర తక్కువ ఉండడంతో మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ, అది అతి స్వల్పమేనని ఆ శాఖ వెల్లడించింది. కాగా ఈ20 ఇంధనం పాత వాహనాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందేమో..? డ్రైవింగ్ను దెబ్బతీస్తుందేమో..? అని వాహనదారులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇథనాల్ను కలిపిన పెట్రోల్ను వినియోగించడంవల్ల మైలేజీ సమస్యలు వస్తాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ ఇప్పటికే వివరణాత్మక స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ కలిసిన పెట్రోల్తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు తలెత్తవని వెల్లడించింది. ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వ్యాఖ్యానించింది. కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం పలుమార్లు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.