ముంబై: ఒక చిరుత పిల్ల ఆహారం కోసం వెతుకుతూ పొరపాటున బావిలో పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దానిని వెలికితీసి రక్షించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. చందవాడ్ తాలూకా పూరి గ్రామంలోని వ్యవసాయ బావిలో నాలుగు నెలల చిరుత పడింది. బయటకు రాలేక బావి అంచున కూర్చొని ఉన్నది. గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఫారెస్ట్ బృందం అక్కడికి చేరుకున్నది.
స్థానికులు తొలుత ఒక మంచానికి తాళ్లు కట్టి బావిలోకి దించారు. చిరుత కూన దానిపైకి చేరింది. అనంతరం అటవీ సిబ్బంది బోనును బావిలోకి దించారు. చిరుత పిల్ల అందులోకి వెళ్లగా బంధించి పైకి తీశారు. రెండు గంటలు శ్రమించి రక్షించిన చిరుత పిల్లకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నట్లు నాసిక్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వీఎస్ నెవాసే తెలిపారు. అనంతరం దానిని తల్లి చిరుతతో కలిపే ప్రయత్నం చేస్తామని చెప్పారు.