తిరువనంతపురం: చాలా మంది అన్నీ ఉన్నా ఏమీ చేయలేకపోతారు..! కొద్ది మంది మాత్రం ఏమీ లేకపోయినా, ఆఖరికి అంగ వైకల్యం ఉన్నా అనుకున్నది సాధించగలుగుతారు..! కేరళకు చెందిన ఓ మహిళ రెండో కోవకు చెందిన వ్యక్తి..! ఆమెకు ఐదేళ్ల వయస్సప్పుడే రోడ్డు ప్రమాదంలో కుడిచేయి తెగిపోయింది. అయినా తన వైకల్యానికి ఆమె అదరలేదు, బెదరలేదు..! ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు..! పట్టుదలతో ప్రయత్నించి అనుకున్నది సాధించింది..! సివిల్స్ – 2022 పరీక్షల్లో మంచి ర్యాంకు దక్కించుకుంది..!
కేరళ రాజధాని తిరువనంతపురం పట్టణానికి చెందిన బీఎస్ అఖిల తనకు ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు కుటుంబసభ్యులతో కలిసి బస్సులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో కుడిచేయి తెగిపోయింది. అయినా చేయి పోయిందని ఆమె కుంగిపోలేదు. బుద్ధిగా చదువుకున్నది. ఉన్నత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. కార్యదీక్షతో చదివి ఆలిండియా లెవల్లో 760వ ర్యాంకు సాధించింది.
అయినా ఆమె సంతృప్తి చెందడంలేదు. తన లక్ష్యం ఐఏఎస్ అధికారి కావడం అని, ప్రస్తుతం తనకు వచ్చిన ర్యాంకుతో ఐఏఎస్ సాధించడం కుదరదని, కాబట్టి ఐఏఎస్ కావడం కోసం మళ్లీ సివిల్స్ రాస్తానని అఖిల వెల్లడించింది. రోడ్డు ప్రమాదంలో వైకల్యం సంభవించినా వెరవకుండా పట్టుదలతో చదువుతున్న అఖిల భవిష్యత్తులో తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని మనం కూడా ఆశిద్దాం..