న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ‘ఒకటో తారీకు ఎప్పుడొస్తుందా! అని నెలంతా ఎదురుచూస్తాం.. తీరా అది అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంది.. మా కష్టాలు మాత్రం అలాగే ఉండిపోతాయి’.. ఓ తెలుగు సినిమా డైలాగ్ ఇది.. ఇప్పుడు దేశంలోని వేతన జీవుల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. అసలే అంతూపొంతూ లేకుండా పెరిగిపోతున్న నిరుద్యోగంతో కోట్ల మంది యువత, తమ స్థాయికి కాకపోయినా.. ఏదో ఒక పని ఇచ్చినా చేస్తామని తిరుగుతున్నారు.. ఇక ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారి పరిస్థితి కూడా నిరుద్యోగులాగానే తయారయ్యిందని పలు ఆర్థిక నివేదికలు చెప్తున్నాయి. పేరుకు ఉద్యోగం చేస్తున్నా.. కనీస అవసరాలు తీర్చుకొనేందుకు కూడా జీతం రాళ్లు సరిపోవటంలేదని వేతన జీవులు వాపోతున్నారు. తాము అధికారం చేపట్టిన ఈ ఎనిమిదేండ్లలో దేశ జీడీపీని అమాంతం పెంచామని, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు జబ్బ లు చరుచుకొంటున్నారు. భారత్ను ధనిక దేశంగా మార్చేశామని ఊదరగొడుతున్నారు.. మరి దేశం ధనవంతమైతే మా జీతాల్లో కోతలెందుకు పడుతున్నాయని ఉద్యోగులు బుర్రలు గోక్కుంటున్నారు. దేశంలో వేతనాల రూపేణా కుటుంబాలకు వస్తున్న ఆదాయంలో వృద్ధిరేటు భారీగా తగ్గినట్టు పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) వెల్లడించిన గణాంకాలు వేతన జీవుల వెతలకు అద్దం పడుతున్నాయి.
దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, వేతనాలు నానాటికీ తగ్గిపోతున్నాయి. 2012-16 మధ్యలో 8.2% ఉన్న వేతనాల వృద్ధిరేటు.. 2017-21లో 5.7 శాతానికి తగ్గినట్టు పీఎల్ఎఫ్ తేల్చింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటే ఈ వృద్ధిరేటు మరో 1%తక్కువగా ఉంటుందని స్పష్టంచేసింది. పట్టణాల్లో 5.5% ఉన్న వేతన వృద్ధిరేటు.. గ్రామాల్లో 2.8 శాతానికే పరిమితమైనట్టు తెలిపింది. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేశాక ఈ వృద్ధిరేట్లు ప్రతికూలంగా మారి గ్రామీణ ప్రాంతా ల్లో మైనస్ 3.7 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో -1.6 శాతానికి పతనమైనట్టు పేర్కొన్నది. ఏ దేశంలోనైనా ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. కానీ, మన దేశంలో అలాంటిదేమీ జరగలేదు. పైగా ద్రవ్యోల్బణం భారీగా పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా తగ్గింది. అయినా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని మోదీ సర్కార్ చెప్తున్నది.
కుటుంబాల ఆదాయ వివరాలను అంచనా వేసేందుకు పరోక్షంగా దోహదపడే వినియోగదారుల వ్యయ సర్వేలను కేంద్రం చాలాకాలం గా ప్రచురించడంలేదు. తమ వైఫల్యాలు బయటపడతాయోనన్న భయమే ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. అయినా శ్రామి కవర్గంలోని మూడు తరగతుల (రెగ్యులర్ వేతన కార్మికులు, రోజువారీ వేతన కార్మికులు, స్వయం ఉపాధి పొందతున్నవారి) ఆదాయన్ని అంచనా వేసేందుకు పీఎల్ఎఫ్ఎస్ ఉపకరిస్తున్నాయి. 2020-21కి పీఎల్ఎఫ్ఎస్ వార్షిక నివేదిక ఈ ఏడాది జూన్లో ప్రచురితమైంది. దీని ప్రకారం.. గ్రామాల్లో 55% మంది స్వయం ఉపాధితోనే జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయపైనే ఆధారపడుతున్నారు. మిగిలినవారిలో 24% రోజువారీ వేతనాలతో, 13% రెగ్యులర్ వేతనాలతో, 8% ఇతర రాబడితో జీవిస్తున్నారు. పట్టణాల్లో 33% స్వయం ఉపాధి, 48% రెగ్యులర్ వేతనాలతో, 13% క్యాజువల్ వేతనలతో, 12% మంది ఇతర రాబడితో జీవిస్తున్నారు.
ఈ మూడు తరగతుల కుటుంబాల సగటు సంపాదన కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్టు పీఎల్ఎఫ్ఎస్ నివేదికలో వెల్లడైంది. పట్టణాల్లో పురుష కార్మికులు మాత్రమే నెలకు సగటున రూ.21 వేల వేతనం పొందుతున్నారని, ఇతర వర్గాల కార్మికులకు గౌరవప్రదమైన వేతనం లభించడం లేదని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధికి ఎక్కువగా ఆధారపడుతున్న వ్యవసాయ రంగంలో నెలకు సగటున పురుషులు రూ.10,228, మహిళలు కేవలం రూ.4,561 సంపాదిస్తున్నట్టు తెలిపింది.
దేశంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ రంగాలు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పదేపదే కోరుతున్నారు. దీనివల్ల మరిన్ని ఉద్యోగాలు సృష్టించొచ్చని ఆమె ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయితే, ఇందుకు విరుద్ధంగా కార్పొరేట్ రంగాలు వ్యవహరిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు, పన్ను తగ్గింపులను ఎంజాయ్ చేస్తూ పెట్టుబడులు మాత్రం పెట్టడం లేదు. దేశ ప్రజల కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కార్పొరేట్ రంగాలు ఎందుకు పెట్టుబడి పెడతాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారికి లాభాలు లేనప్పుడు పెట్టుబడులు ఎలా పెడతారని అంటున్నారు.
సంవత్సరం శాతం
2012-16 8.2
2017-21 5.7
(ద్రవ్యోల్బణాన్ని కలిపితే 4.7)
గ్రామాలు 2.8
పట్టణాలు 5.5
(ద్రవ్యోల్బణానికి
సర్దుబాటు చేశాక)
గ్రామాలు -3.7
పట్టణాలు -1.6