గువాహటి: ఆహారం కోసం వెతుక్కుంటూ అప్పుడప్పుడు అడవుల సమీపంలోని గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించడం సాధారణమే. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అటవీ సరిహద్దులు ఎక్కువగా ఉండటంతో అసోంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. అయితే, పదీ ఇరవై ఏనుగులతో కూడిన మందలు గ్రామాల్లోకి రావడం సాధారణంగా జరుగుతుంది. కానీ తాజా అసోం రాష్ట్రం నగావ్ జిల్లాలోని ఓ గ్రామంలోకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 ఏనుగులతో కూడిన మంద ప్రవేశించింది.
గ్రామ శివార్లలో ఏనుగుల ఘీంకారాలు విని అటుగా వెళ్లిన గ్రామస్తులకు కళ్లు బైర్లు కమ్మాయి. చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 200 ఏనుగులు పంటపొలాల్లో మేస్తూ కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకున్న అటవీ సిబ్బంది గ్రామస్తులతో కలిసి ఏనుగులను అడవిలోకి తిరిగి పంపే ప్రయత్నం చేస్తున్నారు.