న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: అవయవాల మార్పిడి తర్వాత.. దాని పనితీరు కచ్చితంగా తెలుసుకునేందుకు సైంటిస్టులు సరికొత్త పరికరాన్ని తయారుచేశారు. అమెరికాలో ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ‘నార్త్వెస్ట్రన్ యూనివర్సిటీ’ సైంటిస్టులు రూపాయి బిళ్లలో పావువంతుండే ‘ఎలక్ట్రానిక్ సెన్సార్’ను తయారుచేశారు. దీనిని దాత ఇచ్చిన అవయవంపై అమర్చి వైద్యులు అవయవ మార్పిడి ఆపరేషన్ చేస్తారు. 0.7 సెం.మీ ఎత్తు, 0.3 సెం.మీ వెడల్పు, 220 మైక్రాన్ల మందముండే ఈ సరికొత్త పరికరాన్ని బ్లూటూత్ ద్వారా ట్యాబ్, స్మార్ట్ఫోన్కు కనెక్ట్ చేయవచ్చు. ఆపరేషన్ తర్వాత అవయవం పనితీరు ఎలా ఉందన్నది తెలుసుకోవటం సులభతరం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీ మార్పిడిలో సెన్సార్ అద్భుతంగా పనిచేస్తుందని ‘సైన్స్’ జర్నల్ కథనం పేర్కొన్నది. రక్త సరఫరాలో ఎక్కువ తక్కువలు, కిడ్నీ గట్టిపడటం వంటివి సెన్సార్ ముందుగానే గుర్తించిందని తెలిపింది.