న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. జ్యుడీషియల్ కస్టడీ సందర్భంగా తనకు తన మత విశ్వాసాలకు అనుగుణమైన భోజనం సమకూర్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జైన్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది.
కాగా, మనీలాండరింగ్ కేసులో జైన్ను ఈడీ అరెస్టు చేయడం వెనుక బీజేపీ హస్తం ఉన్నదని ఆప్ ఆరోపిస్తున్నది. ఆప్పై కక్షతోనే బీజేపీ తమ నేతలపైకి ఈడీని ఉసిగొల్పిందని కేజ్రివాల్ సందర్భం వచ్చినప్పుడల్లా దుమ్మెత్తి పోస్తున్నారు. జైన్ జైల్లో ఉండి కూడా మసాజ్ చేయించుకుంటున్నాడని ఇటీవల బీజేపీ ఒక వీడియోను బయటపెట్టింది.
దీనిపై కూడా ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అనారోగ్యం కారణంగా పిజియోథెరపీ చేయించుకుంటున్న వీడీయోను రికార్డు చేసి.. మసాజ్ అంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని మండిపడింది. ఇలాంటి కుట్రలు చేయడం బీజేపీకి తప్ప మరే పార్టీకి అలవాటు లేదని ఎద్దేవా చేసింది.