గాంధీనగర్ : దొంగతనం ఆరోపణలపై ఓ దళిత ఇంజినీర్పై సహోద్యోగులు దాడి చేశారు. తీవ్రంగా కొట్టడంతో గాయాలైన బాధితుడు ప్రస్తుతం దవాఖానలో చికిత్స తీసుకొంటున్నాడు. ఈ ఘటన బీజేపీ పాలిత గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో తాజాగా చోటుచేసుకొన్నది. నిందితులందరూ పలన్పూర్లోని ఓ ప్రైవేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పుట్టిన రోజు పార్టీ ఉందని చెప్పి తోటి ఉద్యోగులు బాధిత ఇంజినీర్ను కారులో తీసుకెళ్లారు.
మధ్యలో ఓ చోట వాహనం ఆపి, డీజిల్ దొంగతనం చేశావని ఆరోపిస్తూ దళిత యువకుడిపై దాడి చేశారు. గుజరాత్లో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఎస్సీ నేత హితేంద్ర పితాదియా అన్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడిచిందని, అయితే ఇప్పటి వరకు పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. ఇది దళితుల పట్ల గుజరాత్ బీజేపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నదని విమర్శించారు.