గడగ్: నదిలో ఉండాల్సిన మొసలి దారితప్పి బయటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది. నది పక్కన ఉన్న రైలు పట్టాలు దాటబోతుండగా అటుగా వచ్చిన రైలు మొసలి తలపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో మొసలి తల ఛిద్రమైంది. కర్ణాటక రాష్ట్రం గడగ్ జిల్లా రోనా తాలూకాలోని హోల్ ఆలూర్ గ్రామం శివారులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
రైలు పట్టాలపై మొసలి చనిపోయి పడివుండటాన్ని స్థానికులు గమనించారు. దాన్ని పట్టాలపై నుంచి తొలగించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అటవీ అధికారులతో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అటవీ అధికారులు పంచనామా నిర్వహించి మొసలిని తీసుకెళ్లారు.
కాగా, రైలు పట్టాలపై చనిపోయిన మొసలి 8 అడుగుల పొడవు ఉన్నదని అటవీ అధికారులు తెలిపారు. ట్రాక్ సమీపంలో ఉన్న మలప్రభ నది నుంచి అది వచ్చి ఉంటుందని అధికారులు చెప్పారు.