న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఇవాళ ఉదయం న్యూఢిల్లీ జిల్లాలోని తుగ్లక్ రోడ్డు సర్కిల్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ అశోక్ యాదవ్ తన సర్వీస్ రివాల్వర్తో తనను తానే కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ద్వారక డిప్యూటీ కమిషనర్ హర్షవర్ధన్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
ద్వారకలోని సెక్టార్ 19లోగల ఓ డిస్ట్రిక్ట్ పార్కులో మృతదేహం పడివున్నదన్న సమాచారం మేరకు తమ పోలీసులు అక్కడికి వెళ్లారని, అక్కడ అశోక్ యాదవ్ మృతదేహం లభ్యమైందని చెప్పారు. ఆయన దేహంపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని, ఘటనా ప్రాంతంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని హర్షవర్ధన్ చెప్పారు.
క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీస్కు చెందిన పోలీసులు ఘటనా ప్రాంతం నుంచి ఆధారాలు సేకరించారని, వాటి ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.