స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, మార్చి 30, (నమస్తే తెలంగాణ): గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసంలో దేశ జాతీయ పక్షి నెమలిని పెంచుకోవడంపై అధికారులెవరూ నోరు మెదపడం లేదు. అమేథి జిల్లా మందకా గ్రామానికి చెందిన ఆరిఫ్ అనే రైతుకు కొంత కాలం క్రితం పొలంలో గాయపడిన కొంగ కనిపించింది.
దాన్ని ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. కొంగ పూర్తిగా కోలుకోవడంతో పొలం వద్దకు తీసుకెళ్లి వదిలేశారు. కానీ ఆరిఫ్ కుటుంబం తన పట్ల చూపిన ఆదరాభిమాన్ని వదిలిపెట్టలేక ఆ కొంగ సాయంత్రం తిరిగి ఆరిఫ్ ఇంటికే తిరిగి వచ్చేసింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కొంగను సొంత పిల్లలతో సమానంగా సాకుతున్న ఆరిఫ్ కుటుంబాన్ని అభినందించారు. అప్పటి నుంచే ఆరిఫ్కు కష్టాలు ప్రారంభమయ్యాయి. కొంగ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి అనే విషయం ఆరిఫ్కు తెలియదు. దీంతో అధికారులు అతడికి సమన్లు జారీ చేశారు. అఖిలేశ్కు ఈ విషయం తెలిసి అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.