Bus Driver | భువనేశ్వర్, అక్టోబర్ 29: ఒక బస్సు డ్రైవర్ తన ప్రాణం పోతున్నా.. 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. బస్సు నడుపుతున్న సమయం లో డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన బస్సును రోడ్డు పక్కన ఉన్న ఓ గోడకు ఢీకొట్టాడు. దీంతో 48 మంది ప్రాణాలు కాపాడి తాను మరణించాడు. ఈ ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
బస్సు భువనేశ్వర్కు వెళ్తుండగా మార్గమధ్యలో డ్రైవర్కు గుండెపోటు రావడం.. క్షణాల్లో బస్సును అతడు గోడకు ఢీకొట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి. డ్రైవర్ను దవాఖానకు తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మరణించినట్టు ధ్రువీకరించారు. తమ ప్రాణాలు కాపాడి డ్రైవర్ మరణించడంతో ప్రయాణికులు కంటతడిపెట్టారు.