భోపాల్, జూలై 25: కట్టి ఏడాదే అయ్యింది.. అప్పుడే వర్షానికే కూలిపోయిందో ప్రధాన రహదారి వంతెన. సగం రోడ్డు నీళ్లలో, సగం రోడ్డు బీటలు వారి దర్శనమిచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్లో జరిగిందీ ఘటన. రాజధాని భోపాల్-రాయ్సేన్ జిల్లా రహదారిపై కట్టిన కలియాసోట్ బ్రిడ్జి ఆదివారం అర్ధరాత్రి కూలిపోయింది. 45 అడుగుల మేర రోడ్డు ధ్వంసమైంది. దీనిపై అధికారులను సంప్రదించగా ఈ రోడ్డు గ్యారంటీలో ఉన్నదని, దీనికి సంబంధించిన రిపేర్లన్నీ కాంట్రాక్టర్ చేస్తారని బదులివ్వటం గమనార్హం. నెటిజన్లు వంతెన కూలిపోయిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది డబుల్ ఇంజిన్ సర్కారు ఘనత అని, డబుల్ ట్రబుల్ ఇదేనని కామెంట్లు చేస్తున్నారు.