Electric Car | కోల్కతా, మే 13: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ఖర్చులు భరించలేని ఓ 65 ఏండ్ల వృద్ధుడు సొంతం కారు తయారు చేసుకున్నారు. అది కూడా విద్యుత్తుతో నడిచేలా రూపొందించారు. పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాకు చెందిన షెరాఫత్ అలీ వృత్తిరీత్యా కార్పెంటర్. ద్విచక్రవాహనాలు, వాటి ఇంజిన్లపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి. అయితే, పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా తన ఖర్చులు పెరుగుతున్నందున ఏదైనా పరిష్కారం కనుగొనాలనుకున్నారు.
అనేక రోజుల పాటు శ్రమించి నలుగురు కూర్చునేలా ఎలక్ట్రిక్ కారును తయారుచేశారు. ఈ ఆకుపచ్చటి రంగు కారు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ కారు తయారీకి కేవలం రూ.70 వేలు ఖర్చయ్యిందని షెరాఫత్ అలీ తెలిపారు. కారు చూసిన చాలామంది తమకూ ఇలాంటిది తయారుచేయమని అడుగుతున్నట్టు చెప్పారు.