భద్రక్: గొడవల్లో గాయపడ్డ తన తండ్రిని రక్షించుకోవడానికి 14 ఏండ్ల బాలిక పెద్ద సాహసమే చేసింది. చికిత్స చేయించడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని దైన్య పరిస్థితుల్లో తండ్రిని రిక్షాలో ఎక్కించుకుని 35 కిలోమీటర్లు తొక్కి దవాఖానలో చేర్చింది. ఈ ఘటన ఒడిశాలోని భద్రక్లో ఈ నెల 23న చోటుచేసుకోగా, గురువారం వెలుగులోకి వచ్చింది.
బాలిక తండ్రిని పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలని, వారం రోజుల తర్వాత రమ్మని పంపించేశారు. నాలుగు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి రావడంతో భద్రక్ ఎమ్మెల్యే సాహిబ్ మాలిక్, మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర దాస్ వచ్చి తండ్రి చికిత్సకు అవసరమయ్యే సహాయాన్ని అందజేస్తామని హామీనిచ్చారు. తండ్రిని రక్షించుకోవడానికి బాలిక చేసిన సాహసాన్ని పలువురు ఈ సందర్భంగా అభినందించి, తగిన విధంగా ఆదుకుంటామని చెప్పారు.