బెంగళూరు: కర్ణాటకలోని (Karnataka) తుమకూరులో తొమ్మిదో తరగతి విద్యార్థిని (9th Class Girl) మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాగేపల్లిలోని కాశపురాకు చెందిన 14 ఏండ్ల బాలిక చిక్కబల్లాపూర్లోని (Chikkaballapur) సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటూ 9వ తగతి చదువుతున్నది. ఇటీవల ఆమె తన ఇంటికి వెళ్లివచ్చింది. ఆ సమయంలో కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు ఆమెను ఇంటికి పంపించారు. కొద్దిసేపటికే కడుపు నొప్పి రావడంతో బాలిక మరోసారి హాస్పిటల్కు వెళ్లింది. వైద్యులు పరిశీలించగా.. ఆమె గర్భంతో ఉందని తేలింది. ప్రసవ నొప్పులు అధికమవడంతో ఆమె ఓ బాలుడికి జన్మనిచ్చింది. తల్లీ, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ జిల్లా దవాఖానకు పంపించారు.
ఈ వ్యవహారంపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సీనియర్ వల్లే గర్భం దాల్చినట్లు ఆమె తెలిపింది. అయితే బాలుడిని విచారించగా నిరాకరించాడని చెప్పారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, బాలిక మాటల్లో నిలకడ లేదని వెల్లడించారు. పాఠశాలలో మరో విద్యార్థి పేరు కూడా చెబుతున్నదని, దీంతో అందరినీ విచారించి బాధ్యుల్ని గుర్తిస్తామన్నారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన జిల్లా అధికారులు హాస్టల్ వార్డెన్తోపాటు అసిస్టెంట్ను కూడా సస్పెండ్ చేశారు.