జైపూర్: రాజస్తాన్(Rajasthan)లోని నగౌర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 9 ఏళ్ల విద్యార్థని గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సోమవారం ఉదయం గోటాన్ పట్టణంలో జరిగింది. తాల్నాపూర్కు చెందిన అయిదో తరగతి విద్యార్థిని దివ్య బపేడియా.. స్కూల్ మైదానంలో ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఉదయం స్కూల్ ప్రార్థనలు జరగడానికి ముందు తోటి విద్యార్థులతో కలిసి ఆడుతూ కనిపించిన ఆ అమ్మాయి అకస్మాత్తుగా కిండపడిపోవడం అనుమానాలకు తావుతీసింది.
స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఆ బాలికను స్కూల్ సిబ్బంది తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. బహుశా గుండెపోటు వల్ల ఆ అమ్మాయి మరణించి ఉంటుందని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. స్కూల్ ఆవరణలో దివ్య ఆడుకుంటున్న సీసీటీవీ ఫూటేజ్ను పోలీసులు సేకరించారు. ఆడుతూనే ఆమె ఒక్కసారి కిందపడిపోయినట్లు ఆ ఫూటేజ్లో ఉన్నది. గతంలో ఆ విద్యార్థినికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, శరీరంపై గాయాలు కూడా లేవని, ప్రాథమిక అంచనా ద్వారా కార్డియాక్ అరెస్టు జరిగినట్లు తెలుస్తోందని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇంచార్జీ డాక్టర్ సుక్రామ్ తెలిపారు.
పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు నిరాకరించడంతో ఆ బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.