న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాల్లో ప్రయాణించే 9 కొత్త వందే భారత్ రైళ్లు (Vande Bharat trains) ఆదివారం ప్రారంభంకానున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇవి అందుబాటులోకి వస్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి 9 కొత్త వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్నారు.
కాగా, ఉదయపూర్ – జైపూర్, తిరునెల్వేలి-మధురై-చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు, విజయవాడ – చెన్నై (రేణిగుంట మీదుగా), పాట్నా – హౌరా, కాసరగాడ్ – తిరువనంతపురం, రూర్కెలా – భువనేశ్వర్ – పూరి, రాంచీ – హౌరా, జామ్నగర్-అహ్మదాబాద్ మధ్య 9 కొత్త వందే భారత్ రైళ్లు నడుస్తాయి. వేగవంత మైన ఈ రైళ్లు 11 రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల మధ్య ఉన్న ప్రయాణ సమయం సుమారు రెండు గంటలకుపైగా తగ్గనున్నది. కవాచ్ టెక్నాలజీ వంటి అధునాతన భద్రతతోపాటు ప్రపంచస్థాయి సౌకర్యాలు కొత్త వందే భారత్ రైళ్లలో ఉంటాయని రైల్వే పేర్కొంది.