న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్లో స్టైలిష్ బ్యాట్స్మన్గా, ఆల్రౌండర్గా యువరాజ్ సింగ్కు ఆశించిన పేరు రాలేదనే చెప్పాలి. అతడో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 2007, 2011 వరల్డ్కప్లలో టీమిండియా గెలవడంతో యువీదే కీలకపాత్ర. కెరీర్లో మంచి ఫామ్లో ఉన్న సమయంలో అతడే కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. నిజానికి తాను కూడా కెప్టెన్సీ తనకే దక్కుతుందని భావించినట్లు తాజాగా గౌరవ కపూర్ షో 22 యార్న్స్ పాడ్కాస్ట్లో యువీ అన్నాడు. అయితే తనను కాదని ధోనీకి కెప్టెన్సీ ఇచ్చారని అతడు చెప్పాడు.
నిజానికి 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో కెప్టెన్సీ తనే దక్కుతుందని తాను భావించినట్లు యువీ తెలిపాడు. ఆ ఏడాది ఇండియా 50 ఓవర్ల వరల్డ్కప్లో ఓడిపోయింది. ఇండియన్ క్రికెట్లో గందరగోళం నెలకొన్నది. అదే సమయంలో ఇంగ్లండ్లో రెండు నెలలు, సౌతాఫ్రికా, ఐర్లాండ్లలో ఒక నెల పర్యటనలు ఉన్నాయి. ఆ తర్వాత నెల రోజులు టీ20 వరల్డ్కప్. అంటే మొత్తంగా నాలుగు నెలలు ఇండియా బయటే ఉండాలి. ఆ సమయంలో సీనియర్లు రెస్ట్ కావాలనుకొని టీ20 వరల్డ్కప్ను సీరియస్గా తీసుకోలేదు. దీంతో కెప్టెన్సీ నాకే దక్కుతుందని అనుకున్నాను. కానీ ధోనీ పేరును ప్రకటించారు అని యువీ చెప్పాడు.
కెప్టెన్సీ సమస్య ఉన్నా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయా అని ప్రశ్నించగా.. అంతేకదా. కెప్టెన్ ఎవరైనా వాళ్లకు మద్దతివ్వాల్సిందే. రాహుల్ అయినా, గంగూలీ అయినా, భవిష్యత్తులో ఎవరైనా సరే. చివరికి ఓ టీమ్ మనిషిగా ఉండాలి. నేను అలాగే ఉన్నాను అని యువీ చెప్పాడు. ధోనీ కెప్టెన్సీలోనే ఇండియాకు రెండు వరల్డ్కప్లు అందించడంలో యువీదే కీలకపాత్ర. 2007 వరల్డ్కప్లోనే యువీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.