లక్నో : దివ్వెల వెలుగుల్లో అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరించుకున్నది. దీపావళిని పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన దీపోత్సవం కనుల పండువలా సాగింది. సరయూ నదీ తీరం లక్షలాది దీపపు ప్రమిదల వెలుగుల మధ్య ధగధగలాడింది. ఏటా దీపావళికి ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరయూ నదీ తీరంలో రామ్కీ పైడీ ఘాట్పై లక్షలాది దీపాలతో దీపోత్సవం నిర్వహిస్తున్నది.
ఈ సారి 9లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం నిర్వహించగా.. గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇంతకు ముందు దీపోత్సవంలో 6లక్షల దీపాలను వెలిగించగా.. గిన్నిస్ రికార్డు నమోదు చేసింది. ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా.. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీపోత్సవం నిర్వహించడం ఇది ఐదోసారి. వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు చివరి దీపోత్సవం. వేడుకలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఫైర్కాకర్స్, లేజర్షో చూపరులను కట్టిపడేసింది. దీపోత్సవం సందర్భంగా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించింది. కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై గత పాలకులపై విమర్శలు గుప్పించారు. 2023 నాటికి అయోధ్య రామాలయాన్ని నిర్మించి తీరుతామన్నారు.