చెన్నై: కరోనా లాక్డౌన్ సమయంలో తమిళనాడులోని సాతంకులంలో జరిగిన కస్టడీ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మధురై కోర్టు మరణశిక్ష(Death Sentence) విధించింది. 2020లో ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. నిందితుల్లో శ్రీధర్, రఘుగణేశ్, మురుగన్, బాలకృష్ణన్, ముత్తురాజ్, చెల్లాదురై, థోమన్ ఫ్రాన్సిస్, సముదురై, వేయిల్ముత్తు ఉన్నారు. శ్రీధర్కు 15 లక్షల పెనాల్టీ కూడా విధించారు. తండ్రి జయ్రాజ్, కుమారుడు బెన్నిక్స్.. ఓ మొబైల్ షాపు నడుపుతున్నారు.
అయితే లాక్డౌన్ సమయంలో గడువు ముగిసిన తర్వాత కూడా షాపును ఓపెన్ చేసిన కేసులో జూన్ 19, 2020న వాళ్లను అరెస్టు చేశారు. రాత్రంతా తండ్రీకొడుకుల్ని పోలీసులు తీవ్రంగా చిత్రహింస పెట్టారు. ఆ తర్వాత కోవిల్పట్టి సబ్జైల్కు పంపారు. సాతంకులం పోలీస్ స్టేషన్లో బాధితులను చిత్రహింస పెట్టినట్లు సీబీఐ దాఖలు చేసిన కేసును కోర్టు ఆమోదించింది. కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టడం వల్ల ఆ ఇద్దరూ మరణించినట్లు పోస్టుమార్టమ్లో తేలింది. నిందిత పోలీసులు కేసులో తప్పుడు రికార్డులు సృష్టించే ప్రయత్నం చేశారని, దర్యాప్తును అడ్డుకునేందుకు చూశారని ప్రత్యేక కోర్టు చెప్పింది.