లక్నో: మతం మారాలని తమను బలవంతం చేస్తున్నారని 400 మందికిపైగా ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 9 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగట్ పురంలోని మాలిన్ గ్రామానికి చెందిన పేదలు, చిరు వ్యాపారులకు కొందరు వ్యక్తులు కరోనా సమయంలో డబ్బులు, ఆహారం ఇచ్చి సహాయం చేశారు. ప్రతిగా వారిని క్రైస్తవ మతంలోకి మారాలని బలవంతం చేశారు. వారి ఇళ్లలోని దేవుడి ఫొటోలు, విగ్రహాలను బయటకు విసిరేసేలా చేశారు. ఆధార్ కార్డులపై పేర్లు మార్చుకోవాలని చెప్పారు.
కాగా, ఆ పేద ప్రజలు దీపావళి రోజున దేవుడికి పూజలు చేయడాన్ని క్రైస్తవ మతానికి చెందిన వారు అడ్డుకున్నారు. మతం మారిన తర్వాత మళ్లీ పూజలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వారి ఇళ్లలోకి చొరబడి దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. వాటిని బయటకు విసిరేశారు. దీనిపై నిరసన తెలిపిన బాధితులను చంపుతామని బెదిరించారు.
మరోవైపు బలవంతపు మత మార్పిడి బాధితులు స్థానిక బీజేపీ నేతతో కలిసి శుక్రవారం బ్రహ్మపుత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. బలవంతపు మత మార్పిడి, దేవుడి విగ్రహాల ధ్వంసం, చంపుతామని తమను బెదిరించడంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఛబిలి అలియాస్ శివ, బిన్వా, అనిల్, సర్దార్, నిక్కు, బసంత్, ప్రేమ, తిత్లీ, రాణి అనే 9 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.