భువనేశ్వర్: పూరిలోని జగన్నాథ ఆలయం(Jagannath Temple)లోకి అక్రమంగా చొరబడిన 9 మంది బంగ్లాదేశీలను పోలీసులు అరెస్టు చేశారు. ఆలయం ఆంక్షలను ఉల్లంఘిస్తున్న వారిని తొలుత విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు గుర్తించారు. సింగ్ద్వార్ పోలీసు స్టేషన్ వద్ద ఫిర్యాదు నమోదు చేశారు. ఆలయంకు వచ్చిన పోలీసులు అక్కడ సంచరిస్తున్న బంగ్లాదేశీలను పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. హిందూ మతానికి చెందని వారు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, 9 మంది బంగ్లాదేశీలను అదుపులోకి తీసుకున్నామని, వాళ్లను ప్రశ్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఆలయ ఆచారం ప్రకారం కేవలం హిందువులు మాత్రమే ఆ ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తారు. ఒకవేళ హిందూవేతరుల్ని గుర్తిస్తే చట్టం ప్రకారం వాళ్లను శిక్షించనున్నారు. అరెస్టు అయిన వారి పాస్పోర్టులను పరిశీలిస్తున్నామని, అయితే 9 మందిలో నలుగురు ఆలయం లోపలికి వెళ్లినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.