ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో (Mumbai) ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నది. మహానగరంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం కరోనా కొత్త వేరియంటుకు సంబంధించినవేనని ఓ నివేదిక వెల్లడించింది. బృహిన్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పరిధిలో 280 నమూనాలను పరిశీలించామని అందులో 89 శాతం ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించామని మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. 8 శాతం కేసులు డెల్టా డెరివేటివ్స్కు చెందినవని, మరో మూడు శాతం డెల్టా, ఇతర లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు.
మున్సిపల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తాజాగా ముంబైలో మొత్తం 373 నమూనాలు పరీక్షించారు. ఇందులో 280 నమూనాలు బీఎంసీ పరిధికి సంబంధించినవి ఉన్నాయని వెల్లడించారు. ఈ 280 నమనాల్లో 89 శాతం లేదా 248 నమూనాల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. మరో 8 శాతం లేదా 21 నమూనాల్లో డెల్టా డెరివేటివ్స్, మిగిలిన మూడు శాతం లేదా 11 నమూనాల్లో ఇతర లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
కాగా, 280 మంది రోగుల్లో 21 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులు 96 మంది (34 శాతం) ఉన్నారని అధికారులు తెలిపారు. 41-60 ఏండ్ల మధ్యవారు 79 మంది (28 శాతం), 20 ఏండ్లలోపువారు 22 మంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు.