న్యూఢిల్లీ: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ దేశ వ్యాప్తంగా 87,000 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. పూర్తిగా టీకా తీసుకున్నవారిలో అత్యధికంగా కేరళలో 46 శాతం మంది కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. కేరళలో టీకా తొలి డోసు తీసుకున్న వారిలో 80,000 కరోనా కేసులు నమోదు కాగా, రెండో డోసు తీసుకున్న వారిలో 40,000 మందికి వైరస్ సోకినట్లు అధికారులు చెప్పారు. వంద శాతం వ్యాక్సిన్ రేటు నమోదు చేసిన కేరళలోని వయనాడ్లో కూడా కరోనా కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కేరళతోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.